పుస్తకాల్లోని చిన్న చిన్న నాటికలను స్నేహితులతో వేయించేవాడిని. నాదెప్పుడూ తెరవెనుక పాత్రే. జిల్లా కేంద్రంలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. (రాజనీతిశాస్త్రం) చదివా. నాకున్న పరిజ్ఞానంతో సినిమా తీయగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది. 1996లో స్నేహితుల సాయంతో హైదరాబాద్ వెళ్లా.కొందరి సూచనతో 'దేవదాస్ కనకాల' ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో రెండేళ్ల డిప్లమో కోర్సు పూర్తిచేశా.కనీసం సహాయ దర్శకుడిగా కూడా అవకాశం దొరకలేదు. ఇక్కడ రాణించలేననిపించింది. 1998లో తిరిగి శ్రీకాకుళం వచ్చేశా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించా.సినిమా తీయాలన్న కాంక్ష మళ్లీ 2003లో నన్ను రాజధానికి తీసుకుపోయింది. ఆరునూరైనా ఈ సారి సినిమా తీయడమే నా గమ్యం అనుకున్నా. మరో ఆలోచన లేదు. అప్పట్లో ఓ ప్రముఖ దర్శకుడిని కలిశా.నేను కలిసింది.. పూరీ జగన్నాథ్గారిని. అదీ ఒకరి సిఫార్సుతో. ఆయన నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. 'మేమంతా అడవులు, గట్టులు, పుట్టలు దాటుకొని ఇక్కడికొచ్చాం. నువ్వు నేరుగా విమానంపై నుంచి దిగావు. వాళ్లందరినీ కాదని నీకు అవకాశం ఇవ్వడం సబబా. నీవు ఇప్పుడు చేయాల్సింది.. రేపు మంచి దర్శకుడు అవుతాడు అనిపించిన ఓ సహాయ దర్శకుడిని ఆశ్రయించడం. ఇక్కడ ఎవరి సిఫార్సులు పనిచేయవు. ప్రతిభ ఉన్నవాడికే అవకాశం. నాకైతే రెండు సినిమాల తర్వాత కనిపించు' అని చెప్పారు. సినీ సారాంశం నాకు బోధపడింది. అసలు పని మొదలుపెట్టా.తిరిగాను. చాలమంది దర్శకుల వద్ద పనిచేశాను. కె.రాఘవేంద్రరావు గారికి శిష్యరికం చేశా. నాపై నాకు మరింత నమ్మకం కలిగింది.ఎనిమిదేళ్ల పాటు చాలామంది దగ్గర పనిచేశా. చివరకు చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయవాది సురేష్బాబు నా కథ విన్నారు. సినిమా నిర్మిస్తానన్నారు. నాకు అవకాశం కల్పించారు.నా స్నేహితుడు చెప్పిన చిన్న లైన్ పట్టుకొని కథ అల్లుకున్నాను.
నాది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చినదే. నాకు గతంలోనే నవలలు చదివి నాటకాలు రాసే అలవాటు ఉండటంతో మొదటి సినిమానే అయినా ఎక్కడా శిల్పం చెడిపోకుండా కథ సిద్ధం చేసుకున్నా.'నాకూ ఓ లవరుంది' చిన్న సినిమాగా మొదలుపెట్టినా.. ప్రముఖ సంగీత దర్శకులు రాధాకృష్ణ, ఎడిటింగ్లో ప్రావీణ్యులు ఎం.ఆర్.వర్శ గారు నా సినిమాకు పనిచేస్తామని చెప్పడంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. బ్యాంకాక్లోని అందమైన ప్రదేశాల్లో నాలుగు పాటలు తీసేందుకూ నిర్మాత సురేష్బాబు అవకాశమిచ్చారు.
సినిమా రంగానికి ఎంతో క్రేజీ ఉంది. అయితే పూర్తి అవగాహన ఉన్నవారు మాత్రమే అక్కడ అడుగుపెట్టాలి. కొన్ని సినిమాలు చూసి మిడి మిడి జ్ఞానంతో ఏదో సాధించేద్దామనుకుంటే కష్టం. సినిమా అంటే 24 శాఖల సమన్వయం. ఏదో ఒక రంగంలో పూర్తి అవగాహన పెంచుకొని, కష్టాలు ఎదురైనా ఓర్పు, పట్టుదలతో నిలబడితే రాణిస్తారు. నా దగ్గరకు వచ్చిన వారు ప్రతిభా వంతులైతే తప్పకుండా అవకాశాలు కల్పిస్తా అని అన్నారు .
source : Eenadu news paper Srikakulam edition
- =================================
No comments:
Post a Comment